banner

Saturday, 24 November 2012

సాహిత్యం

తెలుగు నాటకం

సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ సామాజిక చైతన్యం కలిగించే దిశగా కళారూపాలు కృషి చేస్తున్నాయి.. ప్రజల్లో ఒక సామాజిక స్పృహ కలిగిస్తూ వారిలో నిద్రాణమై ఉన్న చైతన్య దీప్తిని జాగృత పరచడానికి అనాదిగా తెలుగుదేశాన కృషి చేస్తున్న కళారూపం నాటకం..
తెలుగునాట నాటక వెలుగులు 1860 లోనే ప్రారంభమైనా కందుకూరివారి ప్రహసనంతో ప్రదర్శనకు నోచుకుంది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు గురజాడ కన్యాశుల్కం తెలుగునాటకానికి దిశా నిర్దేశనం చేసింది.1860-80 వరకు ఆంధ్ర దేశంలో హింది నాటకాల ప్రదర్శనలు జరిగినా కందుకూరి వీరేశలింగం తన పాఠశాల విద్యార్థులచేత ప్రదర్శింపచేసేలా ఒక ప్రహసనాన్ని రచించడంతో ఆయన నాటకరంగ పితామహుడయ్యాడు. ఇక గురజాడ కన్యాశుల్కం ఆనాటి సమాజంలోని దురాగతాలను ప్రతిబింబించడమే కాక వ్యావహారికంగా ఉండడంతో పండిత పామర రంజకమైంది. అప్పుడే వేదం వెంకటరాయశాస్థ్రి గారు రచించిన ప్రతాపరుద్రీయం ప్రెక్షకాదరణ పొందింది. దీంతో కావ్యెషు నాటకం రమ్యం అన్న చందాన పానుగంటి, చిలకమర్రి , శ్రీపాద వంటి మహామహులు నాటకరచనకు పూనుకున్నారు. 1940 తర్వాత తెలుగు నాటకానికి మహత్తర దశ కలిగింది. 1942 లో ఆరంభమైన ఆంధ్రనాటకకళా పరిష్త్తు , 1945లో ప్రజానాట్య మండలి తమ నాటకాల ద్వారా ఊరూరా సామాజిక చైతన్యాన్ని కలిగించాయి. అటు తర్వాత గరికపాటీ వారి మాభూమి, డివి నరసరాజు నాటకం, గొల్లపూడి రాగరాగిని, పాలగుమ్మి పద్మరాజు రక్తకన్నీరు, భమిడిపాటి మరోమొహెంజొదారొ వంటి నాటకాలు అఖిలాంధ్ర దేశాన పలుమార్లు పర్దర్శితమై జనాదరణ పొందాయి.
మరోవైపు తెలుగు నాటకంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఘనత ఆత్రేయకే దక్కుతుంది. సుమారు 15 సంవత్సరాల పాటు నాటక రచయితగా వెలుగొందిన ఆత్రేయ చినీకవిగా తెలుగువారి మనసులు స్పృశించాడు. ఆత్రేయ స్ఫూర్తితో ఆరుద్ర,పివిరమణ, దేవదాస్ కనకాల, తనికెళ్ల భరణి, పాటిబండ్ల ఆనందరావ్.. ఇలా ఎందరో రచయితలు తెలుగు నాట్క వైభవానికి కృషి చేస్తున్నారు

శ్రీనాధుడు

శ్రీనాధుడు ఒక గొప్ప కవి. పల్నాటి వీర చరిత్రము, భీమ ఖండము వంటి కావ్యాలను వ్రాశాడు. శ్రీనాధుడి కావ్యాలలోని పద్యాలూ, అతని చాటుపద్యాలూ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

తెలుగు భాష గురించి శ్రీనాధుడి పద్యం
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి సౌభాగ్యసంపద తల్లికంటె
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె!

పల్నాటి ప్రయాణంలో నీరు దొరకక ఇక్కట్లు పడుతూ ఇలా అన్నాడు
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
(లక్ష్మీ వల్లభుడైనందున శ్రీనివాసుడు 16వేలమందిని పెళ్ళాడాడు. బిచ్చుమెత్తుకొనేవానికి ఇద్దరు భార్యలెందుకయ్యా! పార్వతిని నీవుంచుకొని గంగమ్మను మాకు ప్రసాదించు పరమేశ్వరా!)

అలాగే పలనాటి సీమలో పేదరికం వలన కళాపోషణకు అవకాశం కనిపించలేదు ఆయనకు. అందుకని
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులు వడకున్
కుసుమాస్త్రుడైన దున్నును
వసుధేశుండైన జొన్నకూడే కుడుచున్
మంచి కవిత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఇలా అన్నాడు.
హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫుర చ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌అని!
శివుని తలపైనున్న చంద్రవంకలాగా వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం, సరసత్వము కలిసి ఉంటేనే అది చిరకాలముండే కవిత్వము అవుతుంది.

ఆరు పదుల తెలుగు కవిత

- డాక్టర్‌ ద్వా.నా. శాస్త్రి

స్వాతంత్య్రోద్యమం, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం, సాంఘిక పునరుజ్జీవన ఉద్యమం, పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు ఆధునిక కవిత్వావిర్భావానికి దోహదం చేశాయి. మన రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పార్టీలు, సంస్కరణోద్యమాలు తెలుగు కవిత్వ స్వరూపాన్ని మార్చివేశాయి. అభినవ కవిత్వం కొత్త మలుపులతో కొత్త పుంతలు తొక్కింది. 1947 నుంచి నేటివరకు తెలుగు కవిత బహుముఖాలుగా వెలువడుతూ- విస్తరిస్తూ తెలుగు భాషా వైశిష్ట్యాన్ని, తెలుగువారి జీవన సమస్యల్ని, పరిపాలకుల దురాగతాల్ని, జీవన తత్వాల్నీ చాటి చెప్తూనే వుంది. ఎంత ఆధునికమైనా తెలుగు కవిత్వం మూలాల్ని విస్మరించలేదు. నూతన ప్రక్రియలతో పాటు ప్రాచీన ప్రక్రియలైన పురాణం, కావ్యం, శతకం, దండకం, అవధానం వంటివి సమాంతరంగా వెలువడుతూ ఉండటం విశేషం.


1947 నాటికి భావకవిత్వోద్యమం తెరవెనుకకి వెళ్ళింది. ఆ భావజాలం కొందరి కవులలో ఉన్నా- ఉద్యమస్థాయి కనిపించదు. ఈ కాలంలో అభ్యుదయ కవిత్వం తీవ్రస్థాయిలో వెలువడింది. శ్రీశ్రీ ఈ అభ్యుదయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తన అసామాన్య ప్రతిభతో తెలుగునాడును ఉర్రూతలూగించాడు. ఎక్కడ విన్నా శ్రీశ్రీ గేయాలే. నాటి యువతరాన్ని అభ్యుదయపథం వైపు తనతో లాక్కుని వెళ్ళినవాడు శ్రీశ్రీ. కత్తికంటే కలం గొప్పదని చాటి చెప్పినవాడు శ్రీశ్రీ. నవ్యసాహిత్య పరిషత్తు, సాహితీ సమితి, తెలంగాణా రచయితల సంఘం, సాధన, అ.ర.సం. వంటి సంస్థలు నవీన కవిత్వానికి అండగా నిలిచాయి. ప్రతిభ, అభ్యుదయ, కళాకేళి, సాహితి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికలు తెలుగు కవులకు ఆటపట్టులయ్యాయి. కవులకి లోకానుభవం అవసరమైంది. ప్రపంచ పరిణామాల పట్ల అనుశీలన కవిత్వ హేతువైంది. గత నిరసనకి ప్రాధాన్యం పెరిగింది. సామాజిక స్పృహ (social consciousness) అనే పదానికి ప్రాముఖ్యం వచ్చింది. సమాజ శ్రేయస్సే కవిత్వ ప్రయోజనమైంది. జాతీయ దృష్టి నుంచి అంతర్జాతీయ దృష్టి అలవడింది.


”శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు” అన్న అభినవ ఋక్కు కేంద్రబిందువైంది. అలజడి, ఆందోళన, తిరుగుబాటు… కవిత్వ వస్తువులయ్యాయి. ”మార్క్సిజం” అభినవ కవిత్వానికి ప్రాణమయ్యింది. కవుల అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలయ్యాయి. దాశరథి, సోమసుందర్‌, ఆరుద్ర, అనిశెట్టి, కాళోజీ, రెంటాల, గంగినేని, కుందుర్తి, పురిపండా, మల్లారెడ్డి, సినారె వంటివారెందరో కొత్త కవిత్వాన్ని సృష్టించి తెలుగు కవిత్వానికి దిశానిర్దేశం చేశారు. వీరందరివల్ల నవ్య కవిత్వానికి వారసులు ఇబ్బడిముబ్బడిగా తయారయ్యారు.

అయితే – ఈ అభ్యుదయ ఉద్యమం దాదాపు 1965 వరకు ఉధృతంగా సాగింది. కవితారంగాన్ని చైతన్యపరచింది. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించింది. వామపక్ష పార్టీలలో చీలికలు రావటం వల్ల అభ్యుదయ కవులు కూడా చేరిపోయారు. అభ్యుదయ కవులు సినీకవులయ్యారు. రాజీతత్వం అలవరచుకున్నారు. ప్రభుత్వ పదవుల కోసం, మెప్పు కోసం తాపత్రయపడ్డారు. దీంతో అభ్యుదయ ఉద్యమ తీవ్రత తగ్గి బలహీనపడింది.

ఆ తర్వాత ఆరుగురు యువకులు కలిసి దిగంబర కవిత్వోద్యమం తీసుకువచ్చారు. 1965లో నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే కవులు – ”మంచి కోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం మా దిగంబర గొంతుకతో చెప్పదలచుకున్నాం” అంటూ మూడు కవితా సంపుటాలు తెచ్చారు. “నిరుద్యోగం, దారిద్య్రం, కుహనా రాజకీయాలు, మతకలహాలు, సాహిత్య వ్యాపారం, సెక్స్‌ రచనలు… వంటి వాటితో కూడుకున్న ఈ కుష్టు వ్యవస్థ”పై దుమ్మెత్తి పోశారు. ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌గా వచ్చిన దిగంబర కవిత్వంలో చాలామటుకు అశ్లీలంతో అసభ్య పదజాలంతో, దూషణలతో నిండి వుంది. అంత దిగంబరత్వం పనికిరాదని విమర్శకులూ, పాఠకులూ భావించారు. అందుకే 1968 నాటికే ఈ ఉద్యమం కనుమరుగైంది. ఆరుగురితో పుట్టి ఆరుగురితోనే పెరిగింది. ”వీళ్లు చేసేది అభ్యుదయ రచన కాదు. జాగృతి కోసం ధ్వంస రచన చేస్తారు”, ”ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకొనేటంతగా (ఈ సమాజం) పతనమైందా?” వంటి విమర్శలతో ఉద్యమంగా కాకుండా ఒక ధోరణిగానే నిలిచిపోయింది. పాలపొంగులాంటి ఆవేశం మాత్రమే సుమా! అనిపించింది.

‘మావో వజ్రాయుధం’ అంటూ 1970లో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. విప్లవ కవిత్వం వాడిగా వేడిగా వెలువడింది. దీనికీ శ్రీశ్రీయే నాయకత్వం వహించవలసి వచ్చింది. అప్పటి జనచైనా వీరికి ఆదర్శం. మావోయిజం, లెనినిజం, మార్క్సిజాల సమ్మేళనం విప్లవ సిద్ధాంతంగా మారింది. సాయుధ పోరాటం ద్వారానే శ్రామికవర్గ విముక్తి కలుగుతుందనీ, సామ్రాజ్యవాద, పెత్తందారీ విధానాలను ‘కత్తికి కత్తి’ అనే విధంగా సమాధానం చెప్పాలనీ నిర్ణయించారు. ఎన్నికల బూటకపు పద్ధతిని ఎండగట్టారు. ఇటువంటి భావజాలంతో శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు, సత్యమూర్తి (శివసాగర్‌), నగ్నముని, జ్వాలాముఖి, కె.వి.రమణారెడ్డి మొదలైనవారు కవిత్వం రాశారు. దిగంబర కవులుగా వున్న వారు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్‌ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళారు. కొడవటిగంటి కుటుంబరావు, చలసాని ప్రసాద్‌ వంటివారు విప్లవ కవిత్వం రాయకపోయినా విప్లవ కవులకి పాఠాలు చెప్పే గురువులయ్యారు. ప్రజా కళారూపాలు ఆసరాగా జనం దగ్గరికి విప్లవ కవిత్వం వెళింది. అయితే ఆ తర్వాత ఇది ‘రూటు’ మార్చుకుని – ‘నక్సలైట్‌’ ఉద్యమంగా, ‘పీపుల్స్‌వార్’ ఉద్యమంగా తయారైంది. విప్లవ కవులలో, నాయకులలో చీలికలు వచ్చాయి. ఎవరి గొడుగు వారిదే అయింది. ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అన్నవారే ఏకం కాకపోవటం ఒక పెద్ద విషాదం! భావజాలం ఎలా వున్నా ప్రజలు హింసను సహించలేరు – స్వాగతించలేరు. అందువల్ల 1980 తర్వాత ఉనికి కోసమే విప్లవ కవిత్వం కొనసాగుతోంది తప్ప అప్పటి ఊపులేదు.

ఇన్ని ఉద్యమాలూ వాదాలూ వచ్చినా ”ఆకాశంలో సగం” అయిన స్త్రీలను కవులెవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో, కసితో స్త్రీవాద ఉద్యమం వచ్చింది. ఇంగ్లీషులోగల ”ఫెమినిజం” తెలుగులో స్త్రీవాదమైంది. పురుషాధిక్యతపై ధ్వజమెత్తుతూ స్త్రీల విముక్తికై, ఆత్మగౌరవానికై రూపొందించబడిన ఆలోచనా ధోరణి స్త్రీవాదం. స్త్రీని తల్లిగా, భార్యగా మాత్రమే ముద్రవేయబడటం నుంచి మనిషిగా గుర్తింపు పొందే స్థితి రావాలని కవయిత్రులు కలమెత్తారు. లైంగిక వివక్షను నిరసించారు. స్త్రీకి సమానహక్కు, స్వేచ్ఛలు వీరి లక్ష్యాలు. ‘గురి చూసి పాడే పాట’, ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద సంకలనాలు వీరి ధోరణిని వెల్లడిస్తాయి. ఓల్గా, జయప్రభ, కొండేపూడి నిర్మల, విమల, పాటిబండ్ల రజని, ఘంటసాల నిర్మల, మందరపు హైమవతి, కె.గీత వంటివారు తమ కవిత్వంతో కొత్త కోణాలను ఆవిష్కరించారు. పురుషాధిక్య భావజాలం గలవాళ్ళకి కనువిప్పు కలిగించారు. స్త్రీల సమస్యల్ని, వేదనల్ని ‘స్కానింగ్‌’ చేసినట్లు చూపించారు. పెళ్ళి, సంసారం, ఇంటిచాకిరీ, వంట, సంతానోత్పత్తి వంటి విషయాలపై కూడా గొప్ప కవితలు వెలువడ్డాయి. స్త్రీ వాదుల్లో కూడా ఉదారవాదులు, రాడికల్‌వాదులు, మార్క్సిస్టు వాదులు లేకపోలేదు.

1980 నుంచే స్త్రీవాదం ఉద్యమస్థాయిలో ప్రచారం పొందింది. కొంత సంచలనమూ తీసుకువచ్చింది. కానీ ఈ ఉద్యమం కూడా ఆ సంచలనాన్ని, ఆ తీవ్రతను క్రమేణా కోల్పోతూ వచ్చింది. అభ్యుదయ కవులలాగా ‘పాడిందే పాట’గా అయింది. పురుష ద్వేషం, శారీరక ధర్మాలకి పురుషులే కారణమనటం, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను నిరసించడం లేదా వక్రభాష్యం చెప్పటం, సామ్రాజ్యవాద ప్రభావం ఉండటం వంటి కారణాల వల్ల స్త్రీవాద కవిత్వం విమర్శకు గురైంది. లింగవివక్షకే పరిమితం కాకుండా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసం ప్రాధాన్యం వహించి వుంటే మరింత వియవంతమయ్యేదన్న అభిప్రాయం కలిగింది. ఆవేశమూ, సెక్సూ, పెళ్ళిపై వ్యతిరేకతల వల్ల స్త్రీవాద సానుభూతిపరులను తగ్గించుకొంది. 2000 నాటికి బలహీనపడింది.

ఒకపక్క స్త్రీవాదం ఉద్వేగంతో, ఉత్తేజంతో వస్తున్న రోజుల్లోనే దళితవాదం మొదలైంది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలోని అత్యంత ప్రధాన సమస్య ”కులసమస్య”ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు గాయం ఎక్కడుందో తెలుసుకోకుండా మందులు పూశారు… అంటూ దళితులు తమ గుండె చప్పుళ్ళను వినిపించారు. 1985 ప్రాంతం నుంచి సన్నటి మూలుగులతో ప్రారంభమై 1990-95 ప్రాంతాలలో ఉవ్వెత్తున ఎగసింది. పూలేఇజం, అంబేద్కరిజమ్‌ల సిద్ధాంతాలు ప్రాతిపదికగా దళిత ఉద్యమం బయలుదేరింది. ”అంటరానితనానికి గురై మూడు సహస్రాబ్దాలు జైల్లో బతికి పంచములని పిలువబడ్డ షెడ్యూల్డు కులాలకు చెందినవాళే దళితులు. వాళ్ళు హిందూ, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ సిక్కు మతాలకు చెందిన దళితులే. కుల సమస్య నిర్మూలన కాంక్షాభివ్యక్తి దళిత సాహిత్యం” అని ప్రకటించారు. మొదట్లో బి.సి.లు, ముస్లిములు కూడా దళితులుగానే చెప్పారు, ఆ తర్వాత బి.సి. కుంపటి వేరు, ముస్లిముల కుంపటి వేరు అయింది. కొంతకాలానికి దళితులలోనే మాల, మాదిగ బేధాలు (పూర్వం నుంచి ఉన్నవే) భగ్గుమన్నాయి. ”సంఘటితం కండి” అన్న అంబేద్కర్‌ పిలుపు గాలికి కొట్టుకుపోయింది.

అగ్రకులాల ఆధిపత్య ధోరణిని ప్రశ్నించడం, ఆత్మగౌరవం పొందడం, కులపీడనమై కన్నెర్రజేయడం, మనువాద సంస్కృతిని బద్దలుకొట్టడం, రాజ్యాధికారం… అనే లక్ష్యాలతో ”దళిత కవిత”, ”చిక్కనవుతున్న పాట”, ”పదునెక్కిన పాట”, ”ప్రవహించే పాట” వంటి కవితా సంకలనాలు వెలువడ్డాయి. శివసాగర్‌, ఎండ్లూరి సుధాకర్‌, సతీష్‌చందర్‌, జూలూరు గౌరీశంకర్‌, కత్తి పద్మారావు, మద్దూరి నగేష్‌బాబు, శిఖామణి, మొదలైన కవులెందరో కొత్తచూపుతో, దళిత జీవితాలలోని బహుముఖ పార్శ్వాలను వెలుగులోకి తెచ్చారు. గద్దర్‌, మాస్టర్‌ జీ, గూడ అంజయ్య, అంబటి వెంకన్న, వంగపండు మొదలైన వారు పాటల ద్వారా కులపీడనను ఎండగట్టారు. అయితే 2000 సంవత్సరం తర్వాత దళితుల్లో చీలికలు ఏర్పడ్డాయి. ‘ఎ, బి, సి, డి’ వర్గీకరణ వీళ్ళల్లో ద్వేషాల్ని రగిలించింది. ఈ అంశంపైనా కవిత్వం వెలువడింది. కానీ అంతకుముందున్న ‘సంఘటితం కావడం’ కనపడలేదు. కుల నిర్మూలన ధ్యేయం కాస్తా కుల అంతరాలకు దారితీసింది. దళిత బ్రాహ్మణులు తయారయ్యారు. కసి, దూషణలు చోటు చేసుకొన్నాయి. అయినా దళిత కవిత్వం వెలువడుతూనే వుంది.

ఎప్పుడైతే దళిత ఉద్యమంలో బి.సి.లు భాగస్వాములు కాలేదో అప్పుడు బి.సి.వాద కవిత సంకలనం వెలువడింది. కానీ ఇది కొనసాగలేదు. ఆ తర్వాత ముస్లింవాదం తలెత్తింది. అభద్రతాభావంతో ఈ దేశంలో హీనంగా జీవించవలసి వస్తోందనీ, హిందువుల ఆధిపత్యం వల్ల దీనంగా బతకవలసి వస్తోందనీ, ముస్లిముల పేదరికం పెరిగిపోతోందనీ, వేధింపులు ఎక్కువవుతున్నాయనీ కవులు ముస్లింవాద కవిత్వం రాయటం 2000వ సంవత్సరంలో మొదలైంది. దీనిని మొదట్లో మైనారిటీవాదంగా పిలిచారు. ”నా దేశంలో నేనొక కాందిశీకుణ్ణి” అంటూ ముస్లిం కవులు ”జిహాద్‌”, ”జల్‌జలా” వంటి సంకలనాలు వెలువడ్డాయి. ఖాదిర్‌ మొహియుద్దీన్‌, రసూల్‌, అఫ్సర్‌, ఖదీర్‌, ఖాజా, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌, స్కై బాబా మొదలైనవారు ముస్లింవాద భావజాలంతో కవితా సంపుటాలు వెలువరించారు. షాజహానా, షెహనాజ్‌ వంటి ముగ్గురు నలుగురు కవయిత్రులు మాత్రమే ముస్లింవాద కవిత్వం రాస్తున్నారు. గుంటూరు ఏసుపాదం, కలేకూరి ప్రసాద్‌, మద్దూరి వంటి కొద్దిమంది క్రిస్టియన్‌ మైనారిటీల స్థితిని చిత్రీకరించారు తప్ప క్రిస్టియన్‌ మైనారిటీ కవిత్వం స్థిరపడలేదు. మైనారిటీల హక్కులు ప్రధాన ధ్యేయంగా ముస్లింవాద కవిత్వం వెలువడినా మొత్తం మీద హిందూమతంపైగల కసి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ముస్లింవాద కవిత్వంలో మత ప్రస్తావన ఎక్కువైంది. పైగా ఉర్దూ పదాల వాడకం అధికం. కరీముల్లా కవి ముస్లింవాదంలోని ఈ ధోరణులకి నిరసనగా ”ఇస్లాం వాదం” ప్రారంభించాడు. ఇస్లాంవాద కవిత సంకలనాలూ వెలువడ్డాయి. అయితే ఇదొక వాదంగా స్థిరపడవలసి ఉంది.

ఈ వాదాలూ ధోరణులూ ఇలా ఉండగా, ‘ప్రత్యేక తెలంగాణా’ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ కవులు ప్రాంతీయ స్పృహతో కవిత్వం రాయటం 1995 ప్రాంతంలో మొదలైంది. తెలంగాణా వివక్షకు గురవ అవుతోందనీ, తెలంగాణీయుల ఉనికి, భద్రత ప్రశ్నార్థకాలవుతున్నాయనీ దిగులు చెందుతూ తమ ప్రాంతం మీద తమకే అధికారం ఉండాలనీ, కోస్తా ఆంధ్రుల పెత్తనం అంతమవ్వాలనీ… ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చింది. తెలంగాణాపై ఎప్పటినుంచో గళమెత్తుతున్న కవి కాళోజీ మరింత బలంగా వక్కాణించారు. ”పొక్కిలి”, ”మత్తడి” వంటి సంకలనాలు ప్రాంతీయ స్పృహను శక్తివంతంగా చిత్రీకరించాయి. జూలూరు గౌరీశంకర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిధారెడ్డి, వేణుసుంకోజు, యెన్నం ఉపేందర్‌, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన కవులు తెలంగాణా వాసుల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇస్తూ కవితలు రాశారు. తమ ఆత్మగౌరవాన్ని నిర్దిష్టమైన స్వరంతో వెల్లడించారు. కానీ – కొద్దిమంది కవితల్లో కోస్తా ప్రాంతంపై ద్వేషం కనిపిస్తుంది. దూషణ కూడా చోటు చేసుకొంది. తమ అస్తిత్వ పోరాటంలో ఆ ఆవేశం తప్పదంటారు. కసి, ద్వేషం వల్ల కవిత్వ వాతావరణం, సహవాసం దెబ్బతింటున్నాయన్నది మర్చిపోకూడదు. తెలంగాణా అస్తిత్వవాదం ప్రభావంతో రాయలసీమ కవులు, ఉత్తరాంధ్ర కవులు తమ ప్రాంతీయ స్పృహను వ్యక్తీకరిస్తూ కవిత్వం రాస్తున్నారు. కవితా సంకలనాలూ వెలువడుతున్నాయి. తెలంగాణాలో వెలువడిన దళిత కవిత్వంలో ఈ ప్రాంతీయ అస్తిత్వ వేదన బాగా ఎక్కువ. ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వంలో ధిక్కార స్వరం ఎక్కువైనా తెలుగు సాహిత్యరంగంలో ఇప్పుడు వీస్తున్న గాలి ఇదే!

కొంతకాలం తెలుగు కవిత్వంలో ఆధునికోత్తరవాదం లేదా ఆధునికానంతరవాదం అనే కొత్త ధోరణి ప్రచారంలో వుంది. ఇంగ్లీషులో దీన్ని ”పోస్ట్‌ మోడర్నిజం” అంటారు. పాశ్చాత్య సాహిత్యంలో ఈ ధోరణి 1960ల నాటికే వుండగా మన తెలుగులోకి 1990 తర్వాత ప్రవేశించింది. సిద్ధాంతాల అఖండతను ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన ఈ సిద్ధాంతం ఒక ఆలోచనా ధోరణి. సత్యం, హేతువు, హేతుబద్ధత, గుర్తింపు, విశ్వజనీనత, మహా కథనాలు వంటివాటిని ఆధునికోత్తరవాదం పూర్తిగా ఒప్పుకోదు, విశ్లేషించాలంటుంది. అఖండత స్థానంలో సాపేక్షత ఉండాలంటుంది. సమగ్రత, సార్వకాలీనతలను అంగీకరించదు. సామూహీకరణను నిరసిస్తుంది. అఖండ అర్థాల అంతరార్థాన్ని, ప్రతి అంశాన్ని ఖండఖండాలుగా చూడటాన్ని అంగీకరిస్తుంది. అయితే ఈ ఆధునికోత్తరవాదం ఇవాళ దాదాపుగా లేదని చెప్పాలి. దీనికి పెద్ద ఆదరణా లభించలేదు.

ఈ వాదాలతో పాటు కొంతకాలం ”అనుభూతివాదం” తెలుగు కవిత్వంలో ప్రచారం పొందింది. అనుభూతికి ప్రాధాన్యమిచ్చేది లేదా అనుభూతిని సాక్షాత్కరింపజెయ్యాలన్న తపన గలది అనుభూతి కవిత్వం. రాజకీయ వాదాలకి, సామాజిక స్పృహకి వ్యతిరేకంగా అనుభూతి కవిత్వం వెలువడింది. ఆత్మానుభూతుల్ని ‘శుభ్రం’గా వెల్లడించాలనీ, వ్యక్తివాదానికి లేదా శుద్ధ కళావాదానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్‌, వేగుంట మోహనప్రసాద్‌, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మొదలైనవారు అనుభూతి కవిత్వం రాశారు. తొలి అనుభూతి వాద కవిగా ”అమృతం కురిసిన రాత్రి” కవి బాలగంగాధర తిలక్‌ను చెప్పాలి. అనుభూతి కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వానికి, అంతర్ముఖత్వానికి చెందుతుంది. అస్పష్టత వుంటుంది. కేవలం స్వప్న కవిత వంటిదనీ, సమాజానికి అంత ప్రయోజనం లేనిదనీ విమర్శకులు వెల్లడించారు. అయినా సీతారాం, సిద్దార్థ, నామాడి శ్రీధర్‌, కాశీభట్ల వేణుగోపాల్‌ మొదలైన వారు అనుభూతి కవిత్వం రాశారు.

పాశ్చాత్యవాదాల ప్రభావం ఆధునిక కవిత్వంపై చాలా ఉంది. వ్యక్తి స్వాతంత్య్రం ప్రధానంగా వెలువడిన వాదం ”అస్తిత్వ వాదం” (Externalism). ఆర్‌.ఎస్‌.సుదర్శనం, వేగుంట, నిఖిలేశ్వర్‌, మాదిరాజు రంగారావు వంటివారు ఈ ధోరణిలో కవిత్వం రాశారు. 1947 తర్వాత ఆధునిక కవిత్వాన్ని బాగా ప్రభావితం చేసినవాదం ”ప్రతీకవాదం” (Symbolism). సంవిధాన శిల్పానికి ప్రతీకవాదం ఉపకరించింది. కవి వాడిన ప్రతీకలు తెలిస్తే ఆనందమే. లేకపోతే అస్పష్టత తప్పదు. వస్తువును వ్యాఖ్యానించటానికి, అనల్ప భావాన్ని సంక్షిప్తంగా వివరించడానికి ప్రతీక తోడ్పడుతుంది. ప్రతీకలు కవిభావాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే వైయుక్తికమై ఉంటాయి. ”సమగ్ర భావమయ ప్రపంచం” ప్రతీకలలో దర్శనమిస్తుంది. ఆరుద్ర ”త్వమేవాహం” కావ్యం ప్రతీకాత్మక కావ్యం. శ్రీరంగనారాయణబాబు, శ్రీశ్రీ, శేషేంద్ర, సినారె వంటివారు ప్రతీకల్ని సమర్థవంతంగా ప్రయోగించారు. ఆధునిక కవి ‘ప్రతీక’లు లేకుండా మంచి కవిత్వం రాయలేడని చెప్పదగినంతగా ప్రతీకవాదం వ్యాపించింది.

ఆధునిక కవిత్వంలో భావచిత్రణ లేదా పదచిత్రణ (Imagism) ముఖ్యమైన కవితా శిల్పమైంది. కవిత్వంలో గొప్ప అభివ్యక్తికి ఈ భావచిత్రణ ప్రధానసాధనమైంది. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన ఈ ”టెక్నిక్‌”కి ఎజ్రాపౌండ్‌ను చెప్తారు. అతని ప్రభావంతోనే తెలుగులో ‘ఇమేజిజమ్‌’ను కవులు సమర్థవంతంగా ప్రయోగించారు. ”భావచిత్రం మనోనయనానికి రూపుకట్టేది. ఇంద్రియ స్పర్శగలది. శబ్దాల ద్వారా రూపుకట్టేది” – భావచిత్రం! కవితా నిర్మాణ సామగ్రిలో పదచిత్రణ ముఖ్యమైంది. పాఠకుడ్ని ఉత్తేజపరచటంలో, పాఠకుడిలో సంపూర్ణ అవగాహన, అనుభూతి కలిగించటంలో పదచిత్రణ తోడ్పడుతుందిగానీ – ఇక్కడ కూడా అస్పష్టత తప్పదు! డాడాయిజమ్‌ లేదా విధ్వంసనవాదం అనే ధోరణిలో కొందరు కవిత్వం రాశారుగానీ ఆదరణ లభించలేదు – పాఠకుల మెప్పు పొందలేకపోయింది. ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ శాస్త్రం (Psycho analysis) ఆధారంగా ఆధునిక కవిత్వంలో కొంతమంది ”అధివాస్తవికతా వాదం” ప్రవేశపెట్టారు. దీనిని ‘సర్రియలిజమ్‌’ అంటారు. అన్వయరాహిత్యం, అవ్యక్త ప్రేలాపన, అజ్ఞాతంగా ఉన్నవాటిని బహిరంగపరచడం అధివాస్తవికతా లక్షణం. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబులు ఈ తరహా కవిత్వం రాశారు. వేగుంట వారి వంటి కవిత్వంలోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం ప్రయోగవాదంగానే నిలిచిపోయింది.

ఆధునిక కవిత్వంపై హేతువాద ప్రభావమూ కనిపిస్తుంది. ”నిర్హేతుకమైన భావాలకూ, ప్రమాణాలకూ తావులేకుండా, యదార్థమైన జ్ఞానాన్ని గుర్తించడమే హేతువాదం” అంటారు త్రిపురనేని రామస్వామి పద్యాలలో ఈ హేతువాద ధోరణిని వ్యాప్తిగావించారు. దళిత వాదంలో హేతుభావాల ఛాయలు కనిపిస్తాయి.

మానవుడే అన్నిటికి మూలం. మానవుడి సంక్షేమమే ప్రధానం. వ్యక్తి సమాజానికి బలి కాకూడదు. వ్యక్తి స్వేచ్ఛ, మానవ సంబంధాలు లేని సమాజం అభివృద్ధి చెందదు. మానవ జీవితం పవిత్రమైంది… అనే భావనలతో మానవతావాద కవిత్వం వెలువడింది. శేషేంద్ర, సినారె, కుందుర్తి, కాళోజీ, పాపినేని శివశంకర్‌, కొప్పర్తి మొదలైన కవుల కవిత్వంలో మానవతావాదం ఎక్కువగా కనిపిస్తుంది.

సుప్రసన్న, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి అనే నలుగురు కవులు చేతనావర్త ధోరణితో కవితా సంకలనాలు తెచ్చారు. అందుకే వీళ్ళని చేతనావర్త కవులు అంటారు. సంప్రదాయ స్పృహ, దేశభక్తి, ఆధ్యాత్మిక దృష్టి ఈ కవిత్వ లక్షణాలు. విదేశీ ”ఇజాల”ని అంగీకరించరు. ప్రగతివాద కవి మార్క్సిస్టు అయి ఉండాలనటం సరికాదంటారు. రాజకీయాలకు అతీతంగా కవి ఉండాలంటారు. ‘చేతనావర్త కవిత్వం’ అనే బృహత్‌ సంపుటం వెలువడింది. అయితే ఇది కొంతకాలం – ఒక ధోరణిగా పేరుపొందింది తప్ప – దీనివల్ల ప్రభావితులైనవారూ, అనుయాయులూ ఉన్నట్టుగానీ – బాగా ప్రచారం పొందిందనిగానీ చెప్పటం కష్టం. కొంతమంది ‘పైగంబర కవులు’గా, ‘నిరసన కవులు’గా కవిత్వం రాసినా గుర్తింపు రాలేదు.

ఇన్ని ఉద్యమాలూ, ఇన్ని నవీన ధోరణుల మధ్య పద్యకవిత్వం తన స్థానాన్ని పదిలం చేసుకొంది. ”నవ్య సంప్రదాయ ఉద్యమం”గా కొందరు ప్రకటించినా – దానిని ఉద్యమం అనటం సమంజసం కాదు. ఇదీ ఒక ధోరణి మాత్రమే! ఈ నవ్య సంప్రదాయానికి విశ్వనాథ సత్యనారాయణ నాయకుడు. గడియారం వేంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, ముదిగొండ వీరభద్రమూర్తి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఉత్పల సత్యనారాయణాచార్య, కరుణశ్రీ, పైడిపాటి సుబ్బరాయశాస్త్రి, వానమామలై వరదాచార్యులు మొదలైనవారి కావ్యాలు ఈ నవ్య సంప్రదాయ ధోరణికి చెందుతాయి. జాతీయతకీ, దేశీయతకీ, గత వైభవ సంస్మరణకీ, ప్రాచీన సాహిత్య వైశిష్ట్యానికీ ప్రాధాన్యం ఇస్తుందీ నవ్య సంప్రదాయం. ప్రాచీన సాహిత్యాన్ని నవీనంగా పునఃప్రతిష్టించాలని చెప్తుంది. పాశ్చాత్య సాహిత్యానికి బానిస కావద్దంటుంది. మన సంస్కృతినీ, వారసత్వాన్నీ గౌరవించాలని హితవు పలుకుతుంది. ‘జాతీయ దృక్పథం’ ఈ ధోరణికి ఉనాది. రాజకీయాలు లేని సాహిత్య సామాజిక స్పృహకి నవ్య సంప్రదాయ కవులు ప్రాధాన్యమిచ్చారు. అయితే మన గత వైభవాన్ని, మూలాల్ని మరచిపోకూడదని బోధించే ఈ వాదం ఉద్యమరూపం పొందలేదన్నది సత్యం.

1947 నుంచి ఆధునిక కవిత్వంలో రూప ప్రాధాన్యం గమనిస్తాం. పద్యరూపం ఆధునిక భావజాల ప్రకటనకి సముచిత రూపం కాదని ‘వచన కవిత’ అవతరించింది. ఇంగ్లీషులోగల ‘ఫ్రీవర్స్’ అనేది ‘వచన కవిత’గా వచ్చింది. సరళంగా, వాడుక భాషలో, నియమ రహితంగా, స్వేచ్ఛగా రాసే అభినవ రూపంగా ‘వచన కవిత’ వ్యాప్తి చెందింది. కుందుర్తి ‘ఫ్రీవర్స్‌ ప్రంట్‌’ ద్వారా వచన కవితోద్యమాన్ని చేపట్టారు. ‘వచన కవిత’ బహుళవ్యాప్తి పొందింది. ఇవాళ కవిత్వమంటే వచన కవిత్వమే అన్నంతగా ప్రాచుర్యం పొందింది. ‘మినీ కవిత్వం’ కూడా కొంతకాలం ఉద్యమస్థాయిలో వెలువడింది. అద్దేపల్లి రామమోహనరావు, రావిరంగారావు, కొల్లూరి, జివి పూర్ణచంద్‌, గుత్తికొండ సుబ్బారావు మొదలైనవారు మినీ కవిత్వోద్యమ సారథులయ్యారు. వచన కవిత్వాన్ని ఇమేజిజమ్‌, అస్పష్టత, వచనప్రాయం… అనే అవలక్షణాల నుంచి మినీ కవిత్వం వచన కవిత్వాన్ని రక్షించింది. వ్యంగ్యం, క్లుప్తతలు ప్రధానంగా వెలువడిన మినీ కవిత్వం కొత్త కవుల్ని తయారు చేసింది. కొల్లూరి ‘మినీ కవిత విప్లవం’ అనే సంకలనాన్ని మొదటగా తీసుకొచ్చాడు. నేటికీ రావి రంగారావు మినీ కవిత్వ ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నారు.

వచన కవిత్వంలో చెప్పుకోదగిన విశేష పరిణామం ‘దీర్ఘ కవిత’. కుందుర్తి కథా కావ్యాలు రావాలని పిలుపునిచ్చినా అప్పటికి ఎవరూ స్పందించలేదు. కథా కావ్యాలతో పాటు ఎక్కువగా దీర్ఘ కవితలు (Long poems) వెలువడ్డాయి- వెలువడుతూ ఉన్నాయి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై విశిష్టమైన దీర్ఘ కవితలు వెలువడ్డాయి. తెలంగాణా నుంచి ప్రాంతీయ స్పృహతో చాలా దీర్ఘ కవితలు వెలువడ్డాయి. జూలూరు గౌరీశంకర్‌, జూగంటి జగన్నాథం, ఛాయారాజ్‌ వంటివారు దీర్ఘకవితలు బాగా రాశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి ‘ప్రపంచ పదులు’ అనే కొత్త రూపాన్ని సృష్టించారు. శారదా అశోకవర్ధన్‌ మాత్రమే ఈ కవితారూపంలో కవిత్వం రాశారు.

గురజాడ సృష్టించిన ‘ముత్యాలసరం’ రూపంలో కొందరు కావ్యాలు రాశారు. ఆధునిక కవిత్వంలో గేయం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంది. గేయం, పాట అనే రూపాలు ఉద్యమ కవిత్వానికి ప్రధాన వాహికలయ్యాయి. విశ్వనాథ, పుట్టపర్తి, బోయి భీమన్న, సినారె, నాగభైరవ, విద్వాన్‌ విశ్వం, బాపురెడ్డి మొదలైనవారు గేయ కావ్యాలతో ప్రస్తుతికెక్కారు. బాలల గేయాలు రాసినవారిలో బి.వి.నరసింహారావు, చల్లా రాధాకృష్ణశర్మ, మిరియాల రామకృష్ణ, నార్ల చిరంజీవి, మసూనా, కరుణశ్రీ వంటివారు బాలల గేయాలు రాశారు.

ఉర్దూలో గజల్‌ కమనీయ కవితాలహరి. అయితే ఆ భాషలో ఎక్కువగా ఈ కవితా రూపం శృంగారపరంగా, తాత్త్వికపరంగా వుంది. దాశరథి కృష్ణమాచార్య గాలిబ్‌ గజల్స్‌ను మొదటగా తెలుగులోకి అనువదించారు. కానీ ఆచార్య సి.నారాయణరెడ్డి తెలుగు గజల్స్‌ సొంతంగా రాసి, పాడటమే కాకుండా గజల్‌ ప్రక్రియకి సామాజిక స్పృహను అద్దారు‌. జపనీస్‌ కవితారూపం ‘హైకూ’ బాగా ప్రచారం పొందింది. ‘హైకూ’ లక్షణాల్ని తెలుగులోకి తీసుకురావటం కష్టం కాబట్టి తెలుగు కవులు ఆ లక్షణాలను పాటించకుండా కేవలం మూడు పాదాలలో హైకూలు రాశారు. గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్‌, పెన్నా శివరామకృష్ణ, బి.వి.వి. ప్రసాద్‌ వంటివారు హైకూల సంపుటాలు ప్రచురించి హైకూ కవితా రూపానికి వ్యాప్తి కలిగించారు. రావి రంగారావు ‘సామాజిక హైకూలు’ రాశారు. ఏమైనా హైకూలలో ప్రగతిశీల భావాలకి, సామాజిక స్పృహకీ చోటు లేదనే చెప్పాలి.
ఆచార్య ఎన్‌.గోపి సొంతంగా ‘నానీ’లు అనే కవితా రూపంలో కవితలు రాసి ఎందర్నో ఆకర్షించారు. నానీలు ఇటీవలి కవితారూపంగా స్థిరపడింది. దాదాపు వందమంది కవులు, కవయిత్రులు ‘నానీ’లు రాశారు. నానీల కవితా సంపుటాలు డబ్బయి వరకు వెలువడ్డాయి. నాలుగు పాదాలలో 20-25 అక్షరాలతో నానీలుంటాయి. నానీలలో తాత్విక చింతనతోపాటు సామాజిక స్పృహ ఉండటం విశేషం.

వచన కవిత్వం ఎంతగా విస్తృతి చెందినా, మరెంతగా ప్రాచుర్యం పొందినా పద్య కవిత్వం వెలువడుతూనే వుంది. విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఈ కాలంలోనే వెలువడింది. పుట్టపర్తివారి ‘శివతాండవం’ ప్రజాదరణ పొందింది. ఉత్పల సత్యనారాయణాచార్యులు ”ఈ జంట నగరాలు – హేమంత శిఖరాలు” కావ్యం ద్వారా పద్యరచనకి కొత్త సొబగులు సమకూర్చారు. జ్ఞానానందకవి, సంపత్కుమార, బేతవోలు రామబ్రహ్మం, రసరాజు, ఆశావాది ప్రకాశరావు, బండ్లమూడి సత్యనారాయణ, అనుమాండ్ల భూమయ్య, నాగభైరవ, ఆచార్య తిరుమల, కులపతి, గరికిపాటి నరసింహారావు, వేముగంటి నరసింహాచార్యులు, కడిమిళ వరప్రసాద్‌ మొదలైనవారెందరో పద్య కవిత్వానికి వన్నెచిన్నెలు సమకూర్చి పద్యం తెలుగువాడి నాల్క అని చాటి చెప్పారు.

ఈ అరవై సంవత్సరాల తెలుగు కవిత్వంలో మరొక ముఖ్యమైన ఉద్యమం తెలంగాణా విముక్తి పోరాటం. దేశానికి స్వాతంత్య్రం లభించినా తెలంగాణా హైదరాబాద్‌ సంస్థానపు నిజాం నవాబు నిరంకుశ పాలనలోనే మగ్గిపోతోంది. నిజాం దుష్ట, నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా కవులు ఉద్యమించారు. దాశరథి, సోమసుందర్‌, కాళోజీ, ఆరుద్ర, రెంటాల మొదలైన కవులతో పాటు యాదగిరి వంటి ప్రజాకవులు నిజాం వ్యతిరేక కవిత్వం రాశారు. తెలంగాణా సాయుధ పోరాట కవిత్వం ప్రత్యేక స్థానం సంపాదించింది.

భాష విషయానికి వస్తే ఉద్యమాల ప్రభావంతో ‘భాషాస్వేచ్ఛ’ లభించింది. వ్యాకరణ సంకెళ్ళు విడిపోయాయి. ‘సారళ్యం’ ప్రాముఖ్యం వహించింది. ప్రజా కవిత్వం వల్ల, అభ్యుదయ, విప్లవ, దళిత ఉద్యమాల వల్ల ప్రజల భాషకి, వాడుక భాషకీ, మాండలికాలకీ ఆదరణ లభించింది. కోస్తా మాండలికేతర మాండలిక భాషలలో విశిష్టమైన కావ్యాలు వెలువడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా మాండలికంలో విలక్షణమైన, ఉదాత్తమైన కావ్యాలు వచ్చాయి. గత అరవై సంవత్సరాల తెలుగు కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే బహుముఖాలుగా విస్తరిల్లుతోందనీ, ఇతర భాషలలోని కవిత్వంకంటే వస్తుపరంగా భాషాపరంగా ముందు వరుసలోనే ఉందనీ, ఈ ఆధునిక కవిత్వం సమాజపరమై మనిషి మనుగడ కోసం, మానవత్వం కోసం పరితపిస్తోందనీ, ‘కాదేదీ కవిత్వానికి అనర్హం’, ‘కవిత్వమొక తీరని దాహం’ అనేవి అక్షర సత్యాలనీ నిరూపిస్తూ దినదినాభివృద్ధి చెందుతోందని తెలుస్తుంది.

నవలాశిల్పం కొన్ని పరిశీలనలు…

-వడ్డెర చండీదాస్‌
నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవిపెద్దవి. యిది పసిది. ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి, కట్నం యిచ్చుకోలేని తన తండ్రిని భయపెట్టినట్లు దయ్యప్పిల్లలా తయారై కూచుంది నవల.
యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే.
మరేదో విషయం గురించి చెబుతూ, ‘నాకు తెలుసు. యేవిఁటో చెప్పమంటే నాకు తెలియదు’ – అని కొన్ని శతాబ్దాల క్రితం వో జిజ్ఞాసువన్నాడు. మాయామర్మం కింద కొట్టిపారేయదలిస్తే నేనో చిన్న ప్రశ్న అడుగుతాను-తీపి అంటే యేమిటి ? తీపి అంటే తియ్యగా వుండేది. తియ్యగాఅంటే ? చక్కెరలాగా వుండేది. చక్కెర యెలా వుంటుంది? తియ్యగా. తియ్యగా అంటే యెలా వుంటుంది? చక్కెరలాగా. చక్కెర యెలా వుంటుంది. తియ్యగా. తియ్యగా అంటె యెలా వుంటుంది? మూడురోజులు ‘కుస్తీ’ పట్టినా ఫలితం వుండదు. తీపి తినిపించండి. యిట్టే తెలిసిపోతుంది. తదనుభవం రవ్వంత కూడా లేని వ్యక్తికి, యే మౌలిక ప్రాతిపదికను గానీ నిర్వచనంలోకి యిమిడ్చి అందించటం సాధ్యపడదు.

నవలాశిల్పం గురించి నాకు తెలుసు. యేవిఁటో చెప్పమని అడిగితే మాత్రం నాకు తెలియదంటాను. అనుభవం లోంచి గ్రహించేందుకు వుపకరించే వివరణలు చెప్పటం వరకే. ఫలానా ఫలానా పుస్తకాలు (నవలలు) చదవండి నవలంటే యేవిఁటో మీకే అవగతవుతుందని చెప్పాల్సొస్తుంది. యీ దృష్ట్యా, నవలాశిల్పం గురించి కొంత ముచ్చటించుకోవొచ్చు.
నవల-నాటకం, కథ-అని అంటాం కాబట్టి నవల, నాటకం కాదు, కథకాదు. మరేవిఁటి?
నాటకంలో, యేదో యితివృత్తాన్నాధారం చేసుకుని కథేదో వుంటుంది – కథలో నాటకీయత దాదాపు లేనట్లే. నాటకంలో పాత్రల చేష్టలూ మాటలూ వుంటాయి. పానకంలో పుడకలా, రచయిత కాలికీ వేలికీ అడ్డు పడేందుకు అవకాశం లేదు. నాటకం చేష్టా ప్రదానం. వేదికమీద ఆడేందుకు తద్వారా ప్రేక్షకుల్లో (శ్రోతలుగూడా) నేరుగా ప్రత్యనుభూతిని కలిగిస్తుంది. కథ, ప్రధానంగా కథన రూపంలో (narrative) వుంటుంది. అంచేత, కథ చెప్పటంలో నేర్పు లేకపోతే విసుగ్గా (boring) తయారవుతుంది.
నాటకీయతనూ కథా కథనాన్నీ సంలీనం చేసి, సంభాషణులు తొడిగి, కథ చెబితే నవల అవుతుంది. అంచేత, చిన్నదైతే (సైజు) కథ, పెద్దదైతే నవల-అని నేను భావించను. నవల నవలే చిన్నదీ పెద్దదీ అంటూ వుండదు. పేజీల దృష్ట్యా దప్ప (సైజు) యిది నవలా శిల్పానికి మూలకందం.
వంద పేజీలకి పైగా సాగినంత మాత్రాన కథ, నవల అవదు. అరవై పేజీలకి మించనంత మాత్రాన నవల కథ అవదు.
నాటకం, కథ, నవల-వీటిని తులనాత్మకంగా పరిశీలిస్తే కొన్ని మౌలిక సామ్యాలూ విభేదాలూ కనిపిస్తాయి. వీటికీ వ్యాసానికీ (essay) చుక్కెదురు. వీటిలో వ్యాసపు ధోరణిని చొప్పించితే పరమఛండాలంగా తయారవుతాయి. నిజానికి మంచి నవలలుగా, కథలుగా నాటకాలుగా రూపించి నిలవ తగ్గ కొన్ని రచనలు, కేవలం కర్ట్‌ లెక్చర్స్‌ చొప్పించటం వల్ల భ్రష్టవఁయ్యాయి. యిందుక్కారణం, ఆయా శిల్పాల తత్వం బాగా తెలియకపోవటమూ కావచ్చు, మరేదైనా ‘బలహీనతా’ కావొచ్చు.
విసృత వర్గీకరణ దృష్ట్యా నవలా శిల్పంలోని రీతులను పరిశీలిస్తే.
ముఖ్యపాత్ర తనకి తానుగా కథ నడపటం-దృక్కోణం యెంత విసృతవైఁనదయినా, అది వైయక్తికమే అవుతుంది. యీ ధోరణిలో రాసిన నవలలో, ముఖ్యపాత్రకి తెలియటానికి వీలులేని సంఘటనలో విషయాలో దిగబడే పొరపాటు అప్పుడప్పుడూ జరిగితే జరగడానికి అవకాశం వుంటుంది. యీ పద్ధతి, నవలకంటే కథకి బాగా నప్పుతుంది.
కథాకథనం రచయిత నడపటం-యిది నవలా ప్రక్రియకి బాగా నప్పుతుంది. యిందులోనే మధ్యలోనే అక్కడక్కడా రచయిత మౌనవ్రతం ప్రారంభించి, పాత్రలచేత తమ గురించి తాము కొన్ని పిట్టకథల్లాటివి చెప్పుకునేలాగా చెయ్యటం, యింకో పద్ధతి. ఆ తరువాత-రచయిత తానే పూర్తిగా కథాకథనం సాగించటంలో రెండు రకాలున్నాయి. వకాల్తా పుచ్చుగుని, పుచ్చుకోకుండానూ. వకాల్తా పుచ్చుగుని చెప్పటం బాగా పాతపద్ధతి. పాత్రల ప్రవర్తనను మెచ్చుకుంటూనో నిరశిస్తూనో నైతికంగానో మరోరకంగానో తీర్పు చెబుతూ సంతోషించటమో విచారపడటమో కోపగించుకోవటమో లాంటి పనులు చేస్తూ కథాకథనం సాగిస్తారు. అవన్నీ చెయ్యాల్సింది మేమూ, మధ్య వీడెవడు (యిదవత్తె) అని విసుక్కుంటారు పాఠకులు. ఐతే, ముఖ్య పాత్ర తానుగా కథాకథనం సాగించే పక్షంలో అటువంటివన్నీ బాగానే వుండొచ్చు. నవలలోని పాత్రల గురించి అదే నవలలో వైయక్తికంగా ఫీల్ అవటానికి గానీ యేరకంగానైనా తీర్పు చెప్పటానికి గానీ, ఆ రచయితకి హక్కులేదు పొమ్మన్నారు, యిటీవలి దశాబ్దాలలో కొందరు ప్రముఖ ప్రపంచ సాహితీ వేత్తలు. యీ ధోరణిలో సాగినవాటిని యీ నాటి ‘ఆధునిక నవల’ (Modern Novel) గా చెప్పేందుకు యెంతమాత్రం వీలులేదు. వకాల్తా పుచ్చుకోకుండా చెప్పటం ఆధునిక నవలా శిల్ప లక్షణాలలో వొకటి. పాత్రలను రూపొందించి వాళ్ళని నేరుగా పాఠకులకు అప్పగించటం, ఆ పైన పాఠకులతో పాటు రచయిత తానూ వొక పాఠకుడిగా వాళ్ళ మీద తీర్పు చెప్పొచ్చు. తన అభిప్రాయాలనూ అభిరుచులనూ అనుసరించి ఫీలవనూవొచ్చు.
చేతనా స్రవంతి (Stream of Consciousness) మరొక పద్ధతి. యిది మరీ యిటీవలి కాలంలో వచ్చింది ప్రముఖంగా. యీ శతాబ్దంలో వొచ్చిన కొన్ని తాత్విక మానసిక సిద్ధాంతాల ప్రభావం వల్ల యీ పద్ధతి రూపొందినట్లు భావించవచ్చు. యిందులో పాత్రల మనోస్రవంతిని కళ్ళెంలేని గుఱ్ఱంలా పరిగెత్తనిస్తారు. చేతనలో చేతనా విచేతనా అంశాలూ, గతవూఁ వర్తమానవూఁ భవిష్యత్తూ బాహ్య అంతర అవధులూ అన్నీ కలగా పులగంగా అలుముకు పోతాయి. పోయి ఝరీ ప్రవాహంలా ముంచెత్తుతుంది. యిందులో రచయిత తానుగా చేసే పని చాలా తక్కువ. తీసుకున్న ఆ కొద్ది వర్తమాన సమయంలో బహిరంగంగా జరిగేవాటి మధ్య లింకుల్లో, ఆ ఝరీ ప్రవాహంలో యిమడజాలని వాటిని, రచయిత తానుగా తగిలిస్తాడు అనేకానేక కారణాల వల్ల పాత్రల మానసం విస్ఫులింగంలా సంచలితవైఁ మరొక వ్యక్తి రచయిత వివరణలోకి నప్పేలాగా యిమడని స్థితిలో యీ పద్ధతి బాగా వుపకరిస్తుంది. రచన మొత్తం యీ రీతిలో సాగితే, యెక్కువ మంది పాఠకులకు కొంత అయోమయం, అవగాహన, రవంత విసుగు కలిగే ప్రమాదం వుంటుంది. పాఠకపరిణతి వొక స్థాయికి వొస్తే తప్ప, యీ రీతికి అంతగా ఆదరణ వుండదు. నాకు తెలిసినంతలో – తెలుగులో చేతనా స్రవంతి నవల వొకే వొకటి వొచ్చింది, యిప్పటికి శ్రీ ‘నవీన్‌’ రాసిన ‘అంపశయ్య’.
కథాకథన ప్రధానమైన రీతి. పాత్రలు అన్నదీ అనుకున్నదీ అనుకోనిదీ, చేసిందీ చెయ్యాలనుకున్నదీ చెయ్యాలనుకోనిదీ, అమాంబాపతూ సోది చెప్పినట్లుగా చెప్పుకుపోతారు. యిది నవలా శిల్పానికి దూరమవుతుంది. ముఖ్యంగా, నాటకీయత లోపిస్తుంది.
సంభాషణ ప్రధానమైన రీతి. నాటకంలో సంభాషణలతో పాటు, నటనకి సంబంధించి బ్రాకెట్లో యిచ్చే దానికి బ్రాకెట్లు తీసేసి సంభాషణల దండ గుచ్చుతారు. నాణెంకి వొకవైపే చూపెట్టినట్లు, పాత్రల ఆంతర్యం పాఠకులకు అంతగా చిక్కదు. పూర్తిగా బిహేవియరిస్టు సైకాలజీ సిద్ధాంతానికి కట్టి పడేసుకుంటే తప్ప, యీ రీతి అభిలషణీయమవదు. పైగా కథనం లోపిస్తుంది.
సమగ్రరీతి నాటకీయతనూ కథాకథనాన్నీ సంలీనం (synthesise) చేసి పాత్రల స్వభావాన్ని విశదపరచే, కథా గమనానికి వుపకరించే, వాళ్ళ జీవితాల్లోని ముఖ్యమైన మలుపుల్ని తెలియజేసే లేదూ అటువంటి మలుపులకి దారి తీసే, సంభాషణలను జోడించి కథ నడుపుకు పోవటం. పాత్రలు తాము అనుకున్నది అంతాకాదు గానీ, వాళ్ళ అంతర్యపుటాంతర్యాన్ని వివరించే మానసిక సంఘటనల స్రవంతిని వాళ్ళకై వాళ్ళే వెలిబుచ్చుకోవటం పాత్రల మానసిక పరిస్థితినీ మూడ్‌నీ అనుసరించి బాహ్య ప్రకృతిని చిత్రించాల్సినపుడు వాళ్ళ ద్వారానే వర్ణించటం. అవసరమనిపించిన చోట్ల తాను ”రచయిత”గా చిత్రించటం. నైతికంగానో చట్టరీత్యానో మరోరకంగానో మరో మరో రకంగానో యెక్కడికక్కడ పాత్రల పీకల మీద ‘జడ్జీ’ఐ కూచోకుండా, అదంతా పాఠకులకి వొదిలెయ్యటము. అంతగా అనిపిస్తే నవల ముగించేసి, దాని మీద ‘జడ్జివ్యాసం’ రాసుకోవచ్చు. సూచన మాత్రంగా అందించే (suggestivity) ధోరణిని అవలంబించటం, వీటంటినీ మించి కూర్పులో ‘బిగి’.
యీనాటి ‘ఆధునిక నవల’ యీ సమగ్రరీతిలో సాగినట్లు చెప్పుకోవచ్చు. అన్నీ, కనీసం కొన్ని లక్షణాలైనా వున్నప్పటికీ, నవలాశిల్పం దృష్ట్యా చెప్పుకో తగిన రచనలా చాలా తక్కువ. అన్నీ వున్నా అవకతవకగా అస్తవ్యస్తంగా బిగిలేకండా కూర్పటంతో శిల్పం దెబ్బతింటోంది.
పత్రికలలో నవలలు సీరియల్స్‌గా రావటం మొదలయ్యాక రీడర్‌షిప్‌ పెరిగినమాట వాస్తవమే గానీ, పాఠకుల స్థాయి చెప్పుకోతగినంతగా పెరగలేదు. యీ సీరియళ్ళు, పత్రికాధిపతులకూ రచయితలకూ వ్యాపార ప్రకియగా మారుతున్నదేమోనని నా అనుమానం. వొకే కథావస్తు యితివృత్తాన్ని తిరగాబోర్లావేస్తూ, సంఘటనలు, స్థితిగతులు, పేర్లు సంభాషణలు తదితరాలను అటు ఇటూ చేస్తూ డజనో డజన్నరో కవలనవలలు వొకే రచయిత రాయటవూఁ కనిపిస్తోంది. తీసుకున్న యే అంశాన్ని గాని లోలోతులకు తరచని నేలబారు తనం (surfacial crawling) యెక్కువగా వున్నట్లనిపిస్తోంది. సంభాషణ, కథమెలిక, సంఘటన, వారవారం మలుపు, అపోహలు, అపార్థాలు, సెంటిమెంటు, రహస్య సంఘటనలు వంటి వాటిని అవుచిత్యాన్ని మించి వాడుకుంటూ యింకా యెదగాల్సిన పాఠకుల్ని యింకాకిందికి దిగలాగే ధోరణి యెక్కువగా కనిపిస్తోంది. యీ తాపత్రయంలో పడటం వల్ల నవలాశిల్పం అధోగతికి జారిపోతోంది. కొందరు పాత్రలు, కాసిన్ని సంభాషణలు, సంఘటనలు వుండి యే రెండొందల పేజీల దాకానో, లాక్కుపోతే నవల అవుతుందనే అభిప్రాయం అస్పష్టంగా యిటీవలి కాలంలో స్థిరపడిపోతున్నదేమోనని నా అనుమానం. తాళ ప్రమాణంలో టన్నుల తూకంలో దయ్యప్పిల్లలా తయారవుతున్న యీరకం సరుకు చూస్తుంటే తెలుగు నవలా సాహిత్యం చివరకేం కాబోతున్నట్లని దిగులు పుట్టుకొస్తుంది.
యీ దృష్ట్యా, తెలుగులో, చెప్పుకోతగిన ”ఆధునిక నవలలు” యేపాటి వున్నదీ గ్రహిస్తే తెలుగు నవలా భవిష్యత్తుకు వుపకరిస్తుంది.
యిటీవల, విప్లవనవల అని వినిపిస్తోంది. నాకు తెలిసినంతలో ఈ పేరున నవల యేది గానీ రాలేదు. విప్లవనవల అంటే నవలాశిల్ప రీతిలో విప్లవమా? ఐతే అభిలషణీయమే. లేక, శిల్ప విధ్వంసనలో విప్లవమా? శిల్పాన్ని కాలదన్నిన రచన, నిలిచే అవకాశం వుండదు. వొక్కొక్క సందర్భంలో ప్రచార సాధనంగా కొంత ప్రయోజనం సాధించవచ్చు. శిల్పాన్ని మన్నిస్తూనే ప్రయోజనాన్ని సాధించే రీతిలో రాయనూవొచ్చు. నాలుక్కాలాలపాటు నిలిచేలా మలచనూవొచ్చు. ధూత్తేరీ, అదంతా మాకొద్దు పొమ్మంటే, యెవరు మాత్రం యేం చెప్పగలరు ! లేక, శిల్పం గురించి కాక నవలా వస్తువు గురించా ? వస్తువుకి సంబంధించి విప్లవమంటే పరిశీలించాల్సిన అంశమే. యెంచేతంటే వస్తువు నుంచి పూర్తిగా విడదీసినప్పుడు, శిల్పం ‘తూతూమంత్రం’ ఐపోతుంది.
నవలాశిల్పమూ – వస్తువూ.
కళ కళ కోసమే అని అన్నా, కళ ప్రయోజనం కోసమే అని అన్నా రాసింది ‘సాహిత్యం’ అవ్వాలంటే శిల్పమూ వస్తువూ అనివార్యావసరం.
వస్తు ప్రసక్తి రాగానే వాస్తవమూ అవాస్తవమూ అనే అంశం తలెత్తుతుంది. యింతకీ వాస్తవం (realism) అంటే యేవిఁటి ? యీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలంటే, యీ ప్రస్తుతన ”రచన” పరిధిని మించిపోతుంది. అంచేత, దేనినైతే యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చునో, అది అనే దగ్గర ఆగిపోయి ముచ్చటిస్తాను అంతర బహిర శారీరక మానసిక అంశాలను యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చు. దహించి వేసే అవమానమూ వాస్తవమే, తీపుగా కోస్తున్న చర్మం క్రింది పొక్కు వాస్తవమే. సంవేదనా వాస్తవమే, నడుస్తున్ననేలా వాస్తవమే. తీసుకునే వస్తువు, అసంబద్ధమూ అసంగతమూ కాకుండా వుండాలంటే అది వాస్తవ పరిధిలోనిదై వుండాలి. అంతర బహిర జగత్తులు, వ్యక్తీ సంఘమూ, శరీరమూ మనసూ-వీటిని వొకదాని నుంచొకటి పూర్తిగా వేరుచేసినప్పుడు మిగిలేది శూన్యం. మనిషి యెదుర్కుంటున్న సమకాలీన సమస్యలన్నీ, వస్తువే వాస్తవమే. వొకదాన్లో నుంచి వొకదాన్ని గమనిస్తూ గ్రహిస్తూ – ఆ సమస్యలకి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలన్నీ ప్రయోజనాలే. మానవత్వం దృష్ట్యా, సమస్య ఐకూచున్న ప్రతిదీ సాహిత్యవస్తువే.
శిల్పమూ వుంది. వస్తువూ వుంది. మరి పేచీ యొక్కడున్నట్లు !!

పోతన(POTANA)

పోతన ప్రసిద్ధ తెలుగు కవి. భాగవతాన్ని తెలిగించాడు. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి.


పోతన, వేమన, బద్దెన వంటివారు వ్రాసిన పద్యాలలో కొన్నింటినే ఎంచుకోవడం కష్టం. కొన్ని ముఖ్యమైన పోతన రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ప్రార్ధనలు

భాగవతం ఆరంభంలో వ్రాసిన ప్రార్ధనా పద్యం ఇది. పోతన అంత్యప్రాసల అందం ఈ పద్యంలో స్పష్టంగా కనుపిస్తుంది.
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

పోతన ముగురమ్మలనూ స్తుతించిన పద్యాలు చాలా మందికి నిత్య ప్రార్ధనా గీతాలు.
సరస్వతీ ప్రార్ధన. ఇందులో తెల్లనివైన 16 వస్తువులను సరస్వతి రంగుతో పోల్చాడు.
శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!

అలాగే లక్ష్మీదేవిని స్తుతించాడు
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్

అమ్మల గన్నయమ్మ పార్వతికి మ్రొక్కాడు.
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా
వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్ముణీదేవి ఈశ్వరిని ప్రార్ధించే పద్యం. సంశయాకులయైన పడతి అమ్మవారిని శరణు జొచ్చి ఎలా బ్రతిమాలుతున్నదో చూడవచ్చును.
నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!

పోతన వినయ స్వభావానికి అద్దం పట్టేది ఈ పద్యం.
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామ భద్రుండట నే
పలికిన భవ హర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా !!

భగవత్తత్వం

గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు సుపరిచితాలు. "దేవుడంటే ఎవరు?" అన్నప్రశ్నకు జవాబు చెప్పడఅనికీ, ఏ మతంవారైనా తమ దేవుడిని స్తుతించుకోవడానికి సముచితాలు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
ఈ పద్యంలో భగవంతుని ఈ లక్షణాలు చెప్పాడు కవి.
జగం పుట్టడానికి కారకుడు
జగం ఆయనలో ఉంటుంది.
జగం ఆయనలో ముగుస్తుంది.
ఆయన పరమేశ్వరుడు (అందరికీ ప్రభువు)
అంతకూ మూల కారణం.
మొదలు. మధ్య, తుది లేనివఅడు.
అంతా తానే
ఆత్మ భవుడు (తనంత తానే జన్మించాడు)
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
మన శక్తి చాలనప్పుడు, వేరు మార్గం లేనప్పుడు దేవుడే దిక్కవుతాడు. ఇక నా వల్ల కాదు. పోరాడి అలసిపోయాను. ప్రాణాలు కడగడుతున్నాయి. నీవు తప్ప వేరు దిక్కు లేదు. పరమేశ్వరా రక్షించు. ఈశ్వరా కాపాడు. అని గజరాజు వాపోయాడు. -- "లావొక్కింతయు లేదు" అన్న పదాలు బాగా వాడుకలోకి వచ్చాయి. "లా" (Law) ఒక్కింతయు లేదు - అని సమకాలీన సమాజంపై చెణుకులు కూడా విసిరారు.
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
వైకుంఠలో గొప్ప మేడలో మందార వన ప్రాంతంలో అమృత సరసు ప్రక్క చంద్రకాంత మణులతో చెక్కి కలువపూలు పరచిన పాన్పుపై శ్రీలక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీహరి గజేంద్రుని శరణుఘోష విని సంరంభంతో బయలుదేరాడు. - ఈ పద్యం గురించి ఒక కధ ప్రచారంలో ఉంది. పోతన ఒక పాదం వ్రాసి, కలం సాగక, వ్రాత కట్టిపెట్టి పొలానికి వెళ్ళాడట. తిరిగి వచ్చి చూస్తే పద్యం పూర్తి అయిఉంది. ఇదేమిటని కూతురినడిగితే మీరే వచ్చి వ్రాశారు గదా నాన్నా అన్నదట. శ్రీరామచంద్రుడే తనపట్ల కరుణించి ఆ పద్యాన్ని పూర్తి చేసి ఉంటాడని పోతన భావించాడు.

సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.
గజేంద్రుని కాచే తొందరపాటులో బయలుదేరిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రములను ధరింపలేదు. పరివారాన్ని, వాహనాన్ని పిలువలేదు. మొగంపై విరిసిన ముంగురులు చక్కనొత్తలేదు. వాదంలో పట్టుకొన్న లక్ష్మీదేవి పైటను కూడా వదలలేదు -- ఈ పద్యాన్ని గురించి కూడా ఒక కధ ప్రచారంలో ఉంది. ఆయుధాలూ, వాహనం కూడా లేకుండా బయలుదేరి గజేంద్రుని ఎలా రక్షిస్తాడు బావగారూ! అని శ్రీనాధుడు ఆక్షేపించాడట. అందుకు సమాధానం చెప్పడానికి పోతన కొడుకు నూతిలో ఒక రాయి వేసి, అమ్మో మామయ్య కొడుకు నూతిలో పడ్డాడని అరిచాడు. వెంటనే శ్రీనాధుడు పరుగెత్తిపోయి నూతి చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాడు. త్రాడు, నిచ్చెన లాంటివి ఏమీ లేకుండా నీ కొడుకును ఎలా కాపాడుకొందామనుకొన్నావు మామయ్యా అని శ్రీనాధుని పోతన కొడుకు ఎత్తిపొడిచాడు. అట.

చదువు

చదువుకోమని హిరణ్య కశిపుడు ప్రహ్లాదునకు చెప్పిన విధం. "తండ్రీ" అని ఒక తండ్రి తన కొడుకును ఎంత చక్కగా బుజ్జగిస్తున్నాడో చూడవచ్చు.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

వర్ణనలు

వామనావతారం ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై పెరిగిన విధాన్ని వర్ణించే ఈ రెండు పద్యాలూ చాలా ప్రసిద్ధి చెందినవి. "ఇంతింతై వటుడింతయై " అన్న పదాలను ఒక నుడికారంగా పలు సందర్భాలలో వాడుతారు. వామనుడు పెరిగిన కొద్దీ సూర్య బింబం స్థాయి ఎలా ఉందో రెండో పద్యంలో వివరంచాడు. ముందు గొడుగుగా ఉంది. తరువాత తలపైరత్నం. తరువాత మెడలో ఆభరణం. ఇలా చివరకు పాదపీఠం అయ్యంది.
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!

సూర్యోదయ వర్ణనం
పౌలోమి దన బాలు పాన్పుపై గనువట్ట
బన్నిన పవడంపుబంతి యనగ
నాయురర్థముల వ్యయంబు లొత్తిలి చాటు
కాలజాంఘికుచేతి ఘంట యనగ
ఘనజంతుజీవితకాలరాసుల విధి
కొలువ నెత్తిన హేమకుంభ మనగ
బశ్చిమదిక్కంత పరగ గైసేయుచో
ముందట నిడుకొన్న ముకుర మనగ
గోకతాపోపశమదివ్యఘటిక యనగ
బద్మినీకాంతనోములఫల మనంగ
మూడుమూర్తుల సారంపు ముద్ద యనగ
మిహిరమండల ముదయాద్రిమీద నొప్పె.

సూర్యబింబం తూర్పుకొండపై ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాని పానుపుమీద కనిపించేట్టు చిలుకల పందిరికి అమర్చిన పగడాలబంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరునిచేతిలోని గంటయా అన్నట్లుంది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాసులను కొలవడానికి ఎత్తిన బంగరుకుంచమా అన్నట్లుంది. పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లుంది, పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది.

సంభాషణా చాతుర్యం

గోప కాంతలు యశోదతో మొరపెట్టుకొన్న విధం. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నామమ్మా అని.
ఓ యమ్మ: నీ కుమారుడు
మాయిండ్లను బాలుబెరుగు మననీడమ్మా:
పోయెద మెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ!
కిట్టయ్యను యశోద ఇలా నిలదీసింది. మన్నెందుకు తిన్నావురా కన్నా అని.
మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మ న్నేల మఱి పదార్ధము లేదే?
ఎబ్బే నేనెందుకు మన్ను తింటాను? వాళ్ళూరికే చాడీలు చెబుతున్నారు. అన్నాడు బాలకృష్ణుడు
అమ్మా! మన్ను దినంగనేశిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

అమృతం కురిసిన రాత్రి

నా కవిత్వం
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం,జరామయం

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్రవిచిత్రాలు.

అగాథ బాధా పాథ పతంగాలూ
ద్జర్,అవీరుల కృతరక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగరవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఈరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

దృశ్య భావాలు

ఘోష
హేష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణం నిక్వణ క్వణల ఝణం ఝణం
బండిమువ్వ
కాలిగజ్జె
కలసిపోయి
పక్షిరెక్క
పొన్నమొక్క
జొన్న కంకె
తగిలి పగిలి
వానచినుకు చిటపటలో కలసి
కొబ్బరిమొవ్వ పిచ్చుక గొంతులో మెరసి
మూలుగు యీలుగు కేక
చప్పటులు చకచకలు నవ్వు
పొదివికొనీ అదిమికొనీ
కదలి కదలి
ఘోష
హేష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్ధపు స్తంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటిమొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
కడలి వచ్చి ప్రిదిలినవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడనాడి
కుంద జాజి సేవంతుల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలల మెట్ల వంగినడచి
అలల కడలి అంచులొరసి
నా తలపులో కలసిపోయి
నా పలుకులలో పరిమళించు
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క

ప్రాతః కాలం చీకటి నవ్విన చిన్ని వెలుతురా! వాకిట వెలసిన వేకువ తులసివా! ఆశాకుంతల ధ్వాంతములో నవసి యిలపై వ్రాలిన అలరువా!-అప్స రాంగనా సఖీ చిరవిరహ నిద్రాపరిష్వంగము విడ ఉడు పథమున జారిన మంచు కలనా! ఆకలిమాడుచు వాకిట వాకిట దిరిగే పేదల సురిగే దీనుల సుఖ సుస్తిని చెరచే సుందర రాక్షసివా! యుద్ధాగ్ని పొగవో- వి రుద్ధ జీవుల రుద్ధ కంఠాల రొదలో కదిలెడి యెదవో! అబద్ధపు బ్రతుకుల వ్యవ హారాల కిక మొదలో? కవికుమారుని శుంభ త్కరుణా గీరమవా! శ్రీ శాంభవి కూర్చిన శివఫాల విలసితమౌ వెలుగుల విబూద్వా! దేశభక్తులూ, ధర్మ పురుషులూ చిట్టితల్లులూ,సీమంతినులూ ముద్దుబాలురూం ముత్తైదువలూ, కూడియాడుచు కోకిల గళముల పాడిన శుభాభినవ ప్రభాత గీత ధవళిమవా!  

కోవెల సంపత్కుమార

సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో కాలుజారకుండా నిలదొక్కుకున్న మనీషుల్లో సంపత్కుమార ఒకరు ..
భారతీయ జీవన మీమాంసను గ్రహించి గతంతో వర్తమాన భవిష్యతుల సామంజస్యాన్ని సాధించుకోవాలనే ప్రేరణ కలిగిన నిత్యసాధకుడు. ఏదో చేయాలనే తపన ఉండి దాన్ని గురించి నిర్దిష్టమైన ఆలోచన వ్యూహం కలిగిన సంపత్కుమార తారాపధంలో కలిసిపోయాడంటే నమ్మలేని నిజమ్.
ఒకప్పుడు వరంగల్లో ధూపాటి వెంకట రమణాచార్యులు, ఉదయరాజు శేషగిరిరావు.. ఆ తర్వాత హరిరాధాక్రిష్ణముర్తి, విశ్వనాథ వెంకటేశ్వర్లు.. ఇదే కోవకు చెందినా కోవెల ద్వయం .. సంపత్కుమార, సుప్రసన్న. వీళ్ళిద్దరూ నాకు రక్తసంబందికులే ఐన సాహిత్య పరంగా వీరితో అనుబంధం మరవరానిది,. ఎక్కువగా సుప్రసన్న పెద్దనాయనతో అనుబంధం ఉన్నప్పటికీ సంపత్తాతతో కేవలం సభానుబంధమే, తాతయ్య పుస్తకం రాసినప్పుడు సంపత్ తాత పంపిన ఆశీస్సులు మరింత బలాన్నిచ్చాయి. ఈరోజు సంపత్ తాత లేదంటే సాహితీ సంద్రం ముగబొఇనత్లెరాయడానికి మాటలు లేక ఆగిపోయిన పదాల నడుమ సంపత్ ధ్రువ తారకు నా స్మృత్యంజలి. 

కన్యాశుల్కం


డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి    Kanyasulkam

 శ్రీ శ్రీ  మహా ప్రస్థానం

 
 డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి       MahaPrasthanam                                                                                             











 














 దేవులపల్లి కృష్ణ శాస్త్రి 

కృష్ణ ప్రకాశం

                 డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి : Krishna Paksham

కందుకూరి వీరేశలింగం 

 రాజశేఖర చరిత్రము

రాజశేఖర చరిత్రము కోసం డౌన్లోడ్ క్లిక్ చేయండి:Rajasekhara charitramu

Gabbilam by Gurram Jashuva


Download Gabbilam here: Gabbilam

గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా  1895  సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి , విశ్వ కవి సామ్రాట్ బిరుదులు పొందారు.


             గబ్బిలమును గూర్చి జాషువా మాటలలో .........
" కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నే నీ కావ్యమును రచించితిని. గ్రంధనామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోచవచ్చును. కానీ అందలి కధానాయకుడు ప్రణయ సందేశమును నంపును. ఇతడంపునది తుకతుక నుడుకు నశ్రుసందేశము. అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజన్మాంతము. తరతరములు. దీని కవధి లేదు. అతడు మన్మధాగ్నితప్తుడు, ఇతడు క్షుధాగ్ని పీడితుడు."


“నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు”


అని యితడు వాపోవును. కులీనులగు రాజులకువలె హంసలు, చిలకలు మున్నగు నుత్తమపక్షి దూతలితనికి జిక్కుట అసంభవము. కావున నిట్టిడుల జీర్ణకుటీరములలో నిరంతరము దర్శన మిచ్చు గబ్బిలము నితనికి సందేశహారిగా బరిగ్రహించితిని. రసజ్ఞుల కిందలి యౌచితి సులభగ్రాహ్యము. ఇంట బ్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ నీశ్వరునితో చెప్పుమని వీడు ప్రార్థించె గాని నిజమున కతని యుద్దేశ్యము దేశారాధన. కైలాసయానమునకు నాపన్నిన త్రోవ కొంత వక్రతకు గురియైనది. ఇది దోషము కాదనుకొందును. ఈ కృతి రసజ్ఞ లోకాదరణ నందిన నా శ్రమ ఫలోన్ముఖము కాగలదు. 
               నేనీ గ్రంధమును ముగించు నవసరమున గుంటూరు జిల్లా బోర్డు ప్రెసెడెంటుగారును, దేశభక్తులును, కళాభిమానులునగు శ్రీ కల్లూరి చంద్రమౌళి చౌదరిగారు మా యూరు దయచేసి గ్రంధము నామూలాగ్రముగా విని పతిత్వము వహించుట కంగీకరించుట నా యదృష్టము. వారికి నా నమస్కారములు. వారికి నేను కృతజ్ఞుడను.


రెండవ  భాగానికి తొలిపలుకు

గబ్బిలము కైలాసమునకు సందేశం తీసికొనిపోయి చిరకాలమైనది. మనపేదవాఁడెదరు తన్నులు చూడసాగినాడు. వాని సందేశ ఫలితంగా నాల్గుమూలల నుండి ప్రసన్న వాయువులు వీవసాగినవి. దేవాలయ ప్రవేశం, హరిజనోద్దరణమని, గాంధీజీ చరకా ఝూంకరణము శ్రవణశుభ గంగాగానము చేసినది. సర్వసమత్వ మను మంత్రరాజాన్ని భారతదేశం వల్లెవేయసాగింది. అరుంధతి సుతుని నిరాశాకాశంలో , ఆశాతటిల్లతలు మోసులెత్తినయి.తన చిరకాల దాస్య క్లేశాన్ని విస్మరించినాడు. గబ్బిలం తిరిగి దర్శనమిచ్చింది. ప్రఫుల్ల వదనుడై తీయని స్వాగతమిచ్చాడు. పండా, కాయాయని ప్రశ్నించినాడు. పండై నదని ప్రకృతి ప్రత్యుత్తర మిచ్చినది.అత్మదేశం, అత్మభారతాంధ్రజాతిలో గల అనైకమత్యం స్వార్థ లుబ్దత, బహుకుల మతావేశ వ్యాధి పీడ, కాబట్టనితనం నేడవని లోని తీరని వేదనలు తన దాస్యముక్తితోడుగా దేశానర్ధకములైన అనేక విషమ సమస్యలతనిని కారింపసాగినయి. తన ఇష్టదేవత తన జాతికి కేతన చిహ్నమైన గబ్బిలానికతడు మరికొన్ని చింతాసందేశాలను చెప్పుకొన  సాగినాడు. గబ్బిలమామూలాగ్రంగా ఆలకించింది. నోరులేని పక్షి మారుపలుకుటకు శక్తిచాలని ప్రాణి ఏమని యోదార్ప గలదు? ప్రదక్షణించి కన్నీరుకార్చి, శివాలయానికి తరలిపోయినది. అతని వాక్కులు చావులేనివై వాయుమార్గమున ప్రతిధ్వనించు చున్నవి.గణబద్ధములైనవి. రెండవ గబ్బిలమను కావ్యమైనిలచినది. నేడుగాక మరొకనాడు ఫలించును. ఫలితమనుభవించు భాగ్యమతని కున్నదో లేదో."










జాషువా కల నిజమైంది! ఆ పరమేశ్వరుడు గబ్బిలము యొక్క సందేశాన్ని పరిగ్రహించాడు.దళితునికి రాజ్యాధికారం వచ్చింది.

Alluri Seeta Ramaraju charitra - Alluri Seeta Ramaraju's biography



Download Alluri Seeta Ramaraju's biography here: Alluri Seeta ramaraju charitra

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

వంశం

సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు.

రామరాజు, సీతారామరాజు

అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంధం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాధ.)

బాల్యం, చదువు
బాల్యంలో అల్లూరి సీతారామరాజు

సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం. [1] వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.

రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.

1909 లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారం లో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.

రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురం లో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తుని లో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.

రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

ఉత్తరదేశ యాత్ర

1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు.

కృష్ణదేవి పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవి పేటలోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.

రెండవ యాత్ర

1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవి పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్తులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావగారు కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు.

అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కధలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.
 బ్రిటీషు అధికారుల దురాగతాలు

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.


ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.


 మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.


గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.


అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

 విప్లవం మొదటిదశ

ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాటయచ్చాడట. 27-7-1923న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.

గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.


విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:
 చింతపల్లి

1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.
 కృష్ణదేవి పేట

ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.
 రాజవొమ్మంగి

ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.


వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.
 అడ్డతీగల

రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసి మరీ వెళ్ళాడు.
రంపచోడవరం

అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాలను గురించి కధలు కధలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.


ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు.

విప్లవం రెండవదశ

డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.


ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.


1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)

క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.

జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాభీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.


2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.


సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.

మరణం

17-4-1924న మన్యంకు కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు.విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు.

ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత, 1923 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.

ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.
ఇతర విప్లవ వీరులు

సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న "పందుకొంటకొన" వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు.


22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగుపూడిలో నివశించాడు.
 రాజు గురించి వివిధ అభిప్రాయాలు
భారత తపాల శాఖ 1986లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల

    * అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
          o కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
          o స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
          o కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.

అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.


1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:

    శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. - (యంగ్ ఇండియా పత్రిక - 1926)

సుభాష్ చంద్ర బోస్-

    సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.

"సీతారామరాజు" బుర్రకధ ముగింపులో ఇలా ఉంది -

    శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది

Telugulo tholi katha evaridi? --- First story in Telugu literature

 

 

 

 

 

 

 

 

 

 Alpajeevi by Rachakonda Viswanatha Sastry or Raavi Sastri




Download Alpajeevi here:   Alpajeevi


తెలుగు నవలా ప్రపంచంలో మొట్టమొదటగా మనస్తత్వ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన నవల అల్పజీవి. దీని రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.

 

తమిళ తంబికి వణక్కం ( ప్రొ" ముదిగొండ శివప్రసాద్ ‌)

'త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌'' సుమారు డెబ్బయి సంవత్సరాలకు పూర్వం పైడిపాటి సుబ్బరామశాస్త్రి వ్రాసిన పాటనా చెవులలో ఇప్పటికీ మారుమోగుతున్నది. తెలుగు భాష జాతి అత్యంత ప్రాచీనమైనది. కాని ఏం ప్రయోజనం? నిన్న మొన్న పుట్టిన హిందీ, మరాఠీ, మలయాళ భాషల కన్నా మన పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. పక్కనున్న తమిళులు మనలను చూసి నవ్వుకుంటున్నారు.


భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాష సౌందర్యం ఆ భాషదే! దేని పలుకుబడి దానిదే! నిజానికి భారత దేశ భాషలలోనే కాదు ప్రపంచ భాషలన్నింటిలోనూ చాలా అందమైన భాష ఏది? అని సాపేక్ష దృష్టి లేకుండా శాస్త్రీయంగా పరిశీలిస్తే తెలుగు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది అజంత భాష. నాద సౌందర్యం తద్వారా సిద్ధిస్తుంది. మాట మంత్రంగా, సంగీత భరితంగా అనిపించేలా వినిపించే భాష మనది. తమిళ భాషకు అక్షరాలు ఇరవై ఆరు మాత్రమే! తెలుగు భాషకు యాభై ఆరు! తమిళులు గర్వంగా చెప్పుకునే జ ష లకు మధ్యలో ఉచ్ఛరించే అక్షరం కూడా తెలుగు ప్రాచీన శాసనాలలో ఉంది. ఇది బండిరాకు కొంచెం సన్నిహితంగా ఉండే లిపి సంజ్ఞ. ఐతే ఏమిటి అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చు. అక్షరాలు ఎక్కువైన కొద్దీ భాషోచ్ఛారణలో క్లారిటీ పెరుగుతుంది. తమిళంలో కాంతి అని వ్రాసి గాంది అని పలుకుతారు ఉర్దూలో సీతారామయ్య అని వ్రాసి సత్తార్‌మియ్యా అని పలుకుతారు. ఇంగ్లీషు మరీ ఘోరం. లిపికీ, సంజ్ఞకూ, ఉచ్ఛారణకూ సంబంధమే ఉండదు. ఐనా అది అంతర్జాతీయ భాష కాబట్టి నోరు మూసుకొని పిల్లలకు అలాగే నేర్పవలసిందే! టి ఎ ఎల్‌ కె అని వ్రాసి టాక్‌ అని ఉచ్చరింపవలసిందే! ఎల్‌ ఏమయింది. అంటే సైలెంట్‌ అని భాషా శాస్త్రవేత్తలు సంజాయిషీ చెప్పారు. శెభాష్‌! సైలెంట్‌ అయితే మరి వ్రాయటం ఎందుకు? టి ఎ ఎ కె అని వ్రాస్తే పోదా? అయితే శివప్రసాద్‌ షేక్స్పియరు కన్నా గొప్పవాడు కాడు. అందుకని వాళ్ల భాష వాళ్ల ఇష్టం అంటారే కాని నా మాట ఎవడు వింటాడు? విశ్వనాథ సత్యనారాయణ గారు 1963వ సంవత్సరంలో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే నవల వ్రాశారు. కాకతాళీయంగా ఆ నవల ముద్రణ నా చేతులమీదుగానే ధారావాహికంగా ప్రచురింపబడటమూ పుస్తకంగా ముద్రింపబడటమూ జరిగింది. దయచేసి తెలుగువారంతా దానిని చదివి తీరాలి.


మళ్లీ మొదటికి వస్తాను. తెలుగు భాష బ్రాహ్మీ లిపి నుండి పుట్టిందని అంటారు. మరి తమిళ లిపి ఎలా పుట్టింది? తమిళ అక్షరాలను దివ్యఫలకాలపై వ్రాసి పరమశివుడో, కుమారస్వామియో వారికి ఇచ్చాడని ఒక కథ. నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. ఈ వివరాలు కొన్ని ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో నీత్కారుని కథ అనే ఘట్టంలో ఉన్నాయి. తమిళులకు భాషాభిమానం ఎక్కువ. ప్రతివాడూ తన మాతృభూమిని మాతృభాషనూ ప్రేమిస్తాడు. తెలుగువారు తప్ప! తెలుగువారికి భాషాభిమానం లేదు. ''తెలుగు తల్లిట తెలుగు తల్లి ఈ చంద్రబాబు సెంటిమెంటల్‌ (మెంటల్‌?) డైలాగులు కొడతాండు అని అన్నది ఎవరు?? తెలుగువారు కలిసి ఉండరు. ప్రపంచ తెలుగు భాషా మహోత్సవాలు చేసుకోరు. తమిళనాడులో ప్రపంచ తమిళ మహాసభలు జరుగుతున్నాయి. తమిళ ప్రభ ఏమిటో వారు ప్రపంచానికి ఉజ్వలంగా చాటుతారు. మరి తెలుగు వాళ్లు ఏం చేస్తున్నారు? కొట్టుకొని చస్తున్నారు. ఇదీ అభిశప్తమైన ఒక జాతి చరిత్ర.
ఎట్టి దురభిమానం లేకుండా చెపుతున్నారు. ఆషామాషీగా కాదు సుదీర్ఘ అధ్యయనానంతరం చెపుతున్నాను. తమిళం కన్నా హిందీ కన్నా కూడా తెలుగు చాలా సుసంపన్నమైన భాష. తక్కిన భాషా కవులకు ఈ కవుల సరసన కూర్చునే అర్హత కూడా లేదు. ఇది ప్రాంతీయ దురభిమానంతో అనటం లేదు.
రెండువేల సంవత్సరాల చరిత్ర గల తెలుగు భాషను అధ్యయనం చేసి అంటున్నాను. ఒక్క సంస్కృత భాషను మినహాయిస్తే తెలుగుతో సాటిరాగల భాష మరొకటి లేదు. కాని మన దురదృష్టం ఏమిటి? బుద్ధి పూర్వకంగా భాషా సంపదను విచ్ఛిన్నం చేసుకున్నాము. నన్నయనుండి చిన్నయ వరకు గల మొత్తం సాహిత్యాన్ని తుడిచి పెట్టాలని ఈ గడ్డమీద పుట్టిన తెలుగు బిడ్డలు ప్రయత్నించటం దారుణం. శారదాదేవి ''అక్ష''మాల నుండి ఎన్నో అక్షరాలు జారిపోయాయి. అరసున్న బండిరా దంత, తాలవ్యాలు మాయమయ్యాయి. శ ష స భేదం కూడా అదృశ్యమైపోయింది. ఇట్లా భాషా సంపదను భ్రష్ఠు పట్టించాము. పాఠకుడు పాటకుడు అయినాడు. స్థానబలం అని వ్రాసి పంపితే స్థనబలం అని అంగప్రదక్షిణ అంటే అంగ ప్రదర్శన అని మన డిటిపి పండితులు టైపుచేసి పంపుతున్నారు. ఏం చేయను? నిస్సహాయుణ్ణి. ఈ పతనానికి ప్రేక్షక పాత్ర వహిస్తున్నాను.






2010 జూన్‌ నెలలో తమిళనాడులో ఒక ఉద్యమం మొదలైంది. ఎక్కడెక్కడ తమిళేతర నామాలున్నాయో వాటిని అన్నింటినీ తమిళ ప్రత్యామ్నాయ నామాలతో మారుస్తున్నారు. అంటే ప్రపంచ తమిళ మహాసభలకు ఇది పూర్వరంగం మంచిపనే కదా! కాదన గలమా? కాని ఎందుకో కొందరు తమిళులకు ఇదేదో మరీ ''అతి''గా అనిపించి పత్రికలలో నిరసన తెలియజేశారు. ''స్టాలిన్‌'' అనే నిరంకుశ నరరూప రాక్షసుడి పేరు నీకెందుకు? తమిళం పేరు పెట్టుకో అని కె.బాలు అనే చెన్నై రచయిత ఒక ప్రముఖ పత్రికలో వ్రాశారు. ఆ మాటకొస్తే రామచంద్రన్‌, జయలలిత, కరుణానిధి, దయానిధి మారన్‌,చిదంబరం, మణిశంకర అయ్యవారు (అయ్యశబ్దం ఆర్య శబ్ద వికృతి) ఇవేవీ కూడా తమిళనామాలు కావు. విశుద్ధ సంస్కృత పదాలు. సూర్య టి.వి. కూడా సంస్కృత పదమే. ధనుష్కోటి, మహాబలేశ్వర్‌, బృహదీశ్వర, కాంచీపురం, మధుర, నాగపట్టణం వంటి పేర్లను కూడా మారుస్తారా? ఏమో ఎవడికి తెలుసు! లక్ష్మణన్‌ అనే పేరును ఎలకుమారన్‌గా మార్చారు. మరి రామన్‌, ముత్తురామన్‌ రామస్వామి నాయకర్‌ వంటి పేర్లను ఎలా మారుస్తారు?? వేచి చూద్దాం!! నాస్తిక పార్టీల వారు దేవాలయాల్లో సంస్కృతం వాడకూడదని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ మధ్య హైదరాబాద్‌లో కొందరు త్యాగరాయ గానసభ పేరును కాళోజీ ప్రాంగణంగా మార్చాలని, రవీంద్ర భారతిని కొమరం భీం కళామందిర్‌గా మార్చాలని బ్రహ్మానందరెడ్డి పార్కును అసఫ్‌ జాహీ పార్క్‌గా హైదరాబాద్‌, సికిందరాబాదులను బాగామతి, తారామతి నగర్‌లుగా మార్చాలని ఆందోళన చేశారు. మంచిదే కదా!!


ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తమిళులు కార్యశూరులు. వారిలో వారికి పరస్పర అభిప్రాయ భేదాలున్నా భాషా సంస్కృతుల విషయంలో వారంతా ఏకమై ఇతరులపై తిరగబడతారు. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, బృహత్‌ దండకారణ్య అంటూ భయంకరంగా సంఘర్షించుకుంటున్నారు. పురాణాలలో సుందోప సుందుల కథ మనకు గుర్తుండే ఉంటుంది. ఎవడికీ భాషాభివృద్ధి, సాంస్కృతిక పోషణ మీద దృష్టి లేదు. శ్రీకృష్ణ దేవరాయలు మావాడు అంటూ కన్నడిగులు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మహోత్సవాలు మొదలు పెట్టారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రి, వీరంతా మావారేనని తమిళులు సగర్వంగా చెప్పుకుంటున్నారు. కాదనగలమా? త్యాగరాజును బ్రతికించింది తమిళులే కాని తెలుగు వారు కాదు. నిజానికి తమిళనాడును వందలాది సంవత్సరాలు తెలుగు నాయకరాజు పరిపాలించారు. తెలుగు భాషను యక్షగానాలను పోషించారు.


ఆ మాటకొస్తే తెలుగువాడు కోనసీమ బ్రాహ్మణుడు అయిన మయూర శర్మ కేరళను పరిపాలించి వారికి వేద భిక్షను పెట్టాడు. ఆదిశంకరాచార్యుల పూర్వీకుల కోనసీమ బ్రాహ్మణులు. కాలడికి వలసపోయారు. బర్మావంటి ప్రాంతాల్లో తెలంగ్‌ అనే ఒక జాతి ఇప్పటికే ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో శని అని తెలుగు సామెత తమిళులలో భాషాభిమానం ఉంది తెలుగు వారికి అది లేదు. ఒక తెలుగువాడు కాస్త అభివృద్ధిలోకి వస్తే వాడి కాళ్లు పట్టి గుంజడానికి పదిమంది సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు విశ్వామిత్రుని చేత శపింపబడ్డావారు అని ఐతరేయ బ్రాహ్మణంలో కొన్నివేల సంవత్సరాల క్రితమే వ్రాశారు. ఇది మన ఖర్మ!! తెలుగు సంస్కృతి కాస్త వికసిస్తుందని సంతోషించే లోపలే ఎవడో ఒక రావణాసురుడు పుట్టి మనకు ఆ ఆనందం దక్కకుండా చేస్తాడు. ప్రపంచ తమిళ మహాసభలు జరుపుకుంటున్న తమిళ జాతిని అభినందిద్దాం. తమిళ సింహళ తమిళ తెలుగు భాషీయుల మధ్య సహనం పాటించవలసిందిగా ఈ సందర్భంలో కరుణానిధి జయలలిత గార్లకు విజ్ఞప్తి చేద్దాం! తెలుగు పాఠశాలలు నడుపుకుంటుంటే కృష్ణగిరి వంటి తెలుగు జనాధిక్య ప్రాంతాలపై తమిళులు దాడిచేయటం తగదు అని ప్రార్థిద్దాం!! తమిళులను చూసైనా మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఇలాంటి ప్రపంచ తెలుగు మహాసభలకు రూపకల్పన చేయాలని ఆశిద్దాం!!                                                                                                                                   ----------ప్రొ// ముదిగొండ శివప్రసాద్‌

No comments:

Post a Comment